వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం

తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రజాభవన్‌ ద్వారా ప్రజాపాలన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో

  • Publish Date - January 14, 2024 / 01:58 PM IST
  • పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విధాత : తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రజాభవన్‌ ద్వారా ప్రజాపాలన నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజులలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలో ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పేదింటి ఆడబిడ్డలు బస్సుల్లో ఫ్రీ సౌకర్యం ద్వారా సొంత గ్రామాలకు వెళ్లారని తెలిపారు. ఆర్టీసీ బస్సులలో 30 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఘనత మా రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్లు సబ్సిడీకి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామ సభలలోనే లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.


నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తుమన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కోట్ల రూపాయలతో హాస్టల్ నిర్మాణం, నల్లగొండ, ముషంపల్లి, కన్నేకల్ మీదుగా తిప్పర్తి వెళ్లేలా 100 కోట్ల రోడ్డుపనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గుండ్లపల్లి నుండి రేగట్ట వరకు 30 కోట్లతో డబుల్ రోడ్డు పనులు ప్రారంభం, ధర్వేశిపురం వయా దోరేపల్లి, పగిడిమర్రి వరకు రోడ్డు పనులు 34 కోట్లతో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలను అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. యాదాద్రి థర్మల్ ఫ్లాంటు అక్రమాలపై విచారణ చేపట్టడం జరిగిందన్నారు. నల్లగొండలో డ్రైనేజీ, మిగిలిపోయిన రోడ్లు, ఇటీవల మున్సిపాలిటీలో విలీనం చేసిన చర్లపల్లి, మర్రిగూడెం, అర్జాల బావిలో అవసరమై అన్ని పనులు చేయిస్తామని ఆయన తెలిపారు.