పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జనగామ పట్టణంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. అనంతరం కొమురయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దొడ్డి కొమురయ్య ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో నిలిచిందన్నారు. భూస్వామ్య ఆధిపత్య వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి పటేల్, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.