Panchayat Elections | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలను వెల్లడించనున్నారు.
తొలి విడతలో భాగంగా మొత్తం 189 మండలాల్లో 3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో సుమారు లక్ష మంది పాల్గొంటున్నారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తొలి విడతలో 395 గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. పోలింగ్ జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల బరిలో 12,690 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వార్డుమెంబర్ల బరిలో 65,455 మంది అభ్యర్థులు నిలిచారు. తొలి విడతలో పంచాయతీ ఎన్నికల్లో 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.8.2 కోట్లను సీజ్ చేసినట్టు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉందన్న ఆయన రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 50 వేల మంది సివిల్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, అదనంగా మరో 60 ప్లటూన్లను బయటి నుంచి తీసుకువచ్చి విధుల్లో నిమగ్నం చేశామని వెల్లడించారు.
