విధాత : పాకిస్తాన్ – అప్ఘానిస్తాన్ దేశాల మధ్య సైనిక ఘర్షణలు మరింత ముదిరాయి. పాకిస్తాన్ ఏకంగా అప్ఘాన్ రాజధాని కాబుల్ ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు పాల్పడంతో ఇరుదేశాల మధ్య పరస్పర సైనిక దాడులు తీవ్రతరమయ్యాయి. ఈ క్రమంలో పాక్ క్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’ వేదికగా అప్ఘానిస్తాన్ పై యుద్దం ప్రారంభించినట్లుగా చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. ‘మా సహనం నశించింది..ఇప్పుడు మాకు.. మీకు మధ్య బహిరంగ యుద్ధమే’ అని అఫ్గానిస్థాన్ను ఉద్దేశించి పేర్కొన్నారు.
‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ పేరుతో పాకిస్తాన్ కాబుల్ పై వైమానిక దాడులు కొనసాగిస్తుంది. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లలో వైమానిక దాడులు జరిగాయని అఫ్గాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. పాక్ దాడులతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ప్రతిగా తాము పాక్పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని అఫ్గాన్ ప్రకటించింది. అయితే అఫ్గాన్ చేసిన ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. తమ దాడుల్లో 150మందికి పైగా అప్ఘానిస్తాన్ సైనికులను హతమార్చామని తెలిపారు.
పాక్ చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్ ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా ఓ ఫొటోను విడుదల చేసింది. సూసైడ్ బాంబర్లు పేలుడు పదార్థాలతో కూడిన దుస్తులు ధరించి, కీలక లక్ష్యాలపై దాడి చేసేందుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. డ్యూరండ్ లైన్లోని పలు ప్రాంతాల్లో ఇరుదేశాల మధ్య భీకరదాడులు కొనసాగుతున్నాయని అఫ్గాన్ అధికార ప్రతినిధి తెలిపారు. తమ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని అఫ్గాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
సత్యం గెలిచిందన్న కేజ్రీవాల్, కవిత
Real Life Bichagadu | రియల్ లైఫ్ బిచ్చగాడు.. భార్య కోసం బిక్షాటన చేస్తున్న లాయర్
