Cheetah Meals | దేశంలో అంతరించిపోయిన చీతాల (Cheetahs) పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి విడతల వారీగా చీతాలను భారత్కు తీసుకొచ్చింది. ప్రస్తుతం అవి కూనో నేషనల్ పార్కులో ఉంచింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఓ కీలక విషయం వెల్లడైంది. చీతాల ఆహారం కోసం ఏడాదికి రూ.కోటికిపైనే ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ మల్హోత్రా అడిగిన ప్రశ్నకు సీఎం మోహన్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కునో నేషనల్ పార్క్లో చీతాల ఆహారం కోసం ఒక సంవత్సరంలో ఎంత మొత్తం ఖర్చు అయ్యిందో తెలపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ మల్హోత్రా అసెంబ్లీలో ప్రశ్నించారు. అలాగే రోజుకు ఎన్ని మేకలను ఆహారంగా ఇస్తున్నారో కూడా చెప్పాలని కోరారు. ఈ పార్క్లో ప్రస్తుతం ఎన్ని చీతాలు ఉన్నాయి..? అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలకు సీఎం మోహన్ యాదవ్ స్పందిస్తూ.. చీతాల ఆహారం కోసం రోజుకు రూ.35,000 ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. 2024-25లో చీతాలకు ఆహారంగా వేసిన మేకల కోసం రూ.1,27,10,870 ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఒక రోజులో చీతాలకు ఎంత ఆహారంగా ఇవ్వాలనే ప్రత్యేక ప్రమాణాలు ఏమీ లేవని చెప్పారు. అవసరమైన విధంగా మాంసం అందిస్తారని వివరించారు. ప్రస్తుతం కూనో నేషనల్ పార్క్లో మొత్తం 32 చీతాలు ఉన్నట్లు తెలిపారు. చీతాల ఆహారం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు లేదని స్పష్టం చేశారు. ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
డియర్ బ్రదర్ వాస్తవాలు తెలుసుకో: కేటీఆర్ పై కవిత ఫైర్
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
