Telangana | కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇది షాకింగ్ వార్త. తెలంగాణలో మార్చి 1వ తేదీ నుంచి వాహనాల ధరలు భారీగా పెరిగిపోనున్నాయి. ఎందుకంటే రహదారి భద్రత పన్ను చెల్లించాలనే నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పన్నును చెల్లించాలనే నిబంధనను మార్చి 1 నుంచి అమలు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగిస్తూ ఈ మేరకు రవాణాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం టూ వీలర్కు రూ. 2 వేలు, తేలికపాటి వాహనాలకు రూ. 5 వేలు, ఇతర వాహనాలకు రూ. 10 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంది. అంటే నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలపై రోడ్ సేఫ్టీ పన్నును కొనుగోలు సమయంలోనే చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పన్ను ఎప్పుడు చెల్లించాలి..?
రవాణా శాఖ నిబంధనల ప్రకారం కొత్త వాహనాలను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలోనే ఈ అదనపు చెల్లించాల్సి ఉంటుంది. త్రీ వీలర్ గూడ్స్ వాహనాలపై గతంలో త్రైమాసిక పన్ను ఉండేది. రవాణాశాఖ దాన్ని లైఫ్ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చింది. రోడ్డు భద్రత చర్యలకు అవసరమయ్యే నిధుల సమీకరణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా సుమారు రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు పన్ను మినహాయింపు ఉంది.
