– నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
– 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు
– ప్రైవేటు రంగంలోనూ లక్షలాది ఉద్యోగాల కల్పనకు కృషి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
– సికింద్రాబాద్ లో జాబ్ మేళా ప్రారంభం
విధాత, హైదరాబాద్: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో స్కిల్ సెంటర్లు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంత్రి.. వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాని ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. స్వామి వివేకానంద ఆలోచనలు, వారి మార్గం యువతకి ఆదర్శమని తెలిపారు. యువ వయసులో మంచి విద్య, ఉద్యోగం అవసరమని అన్నారు. యువత సమస్యలను పరిష్కరించే క్రమంలో ఉద్యోగ కల్పన గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రైవేటు రంగంలోనూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలను ముమ్మరం చేస్తున్నామని వివరించారు. గత పదేళ్లలో ఒక దశాదిశ లేకుండా రాష్ట్రం నడిచిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. యువత పెడదారిపట్టకుండా మాదక ద్రవ్యాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ అనే మాటవినిపించొద్దు అని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. పరిశ్రమల స్థాపన, వాటికి కావాల్సిన నైపుణ్యాన్ని వెలికతీసేందుకు స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు.
రాబోయే ఐదేళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండబోతుందని తేల్చిచెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డిగ్రీ చదువుకున్న వారికి సైతం ఒక ప్రత్యేక కోర్సు అందుబాటులోకి తేబోతున్నామని పేర్కొన్నారు. 35 వేల మందికి ఇప్పటికే పలు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు అందించినట్టు యూత్ సర్వీస్ విభాగం అధికారులు మంత్రికి తెలియజేశారు. సెట్విన్ ఆధ్వర్యంలో 5 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొనగా… 6500 మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కార్యదర్శి సవ్యసాచి ఘోష్, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు.