హైదరాబాద్ : శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. విద్యుత్ పద్దులపై జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపుతుండగా, సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకున్నారు.
చర్లపల్లి జైల్లో ఉన్నాననే భ్రమతో జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా జగదీశ్ రెడ్డి వ్యక్తిగత విషయాలను సభలో ప్రస్తావించారు. జగదీశ్ రెడ్డి హత్య కేసుల్లో నిందితుడు అని రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి సీఎం, మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాను హత్య కేసుల్లో నిందితుడినని నిరూపిస్తే ఇదే సభలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. నిరూపించకపోతే ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ముక్కు నేలకు రాసి, పదవులకు రాజీనామా చేస్తారా..? అని జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డికి జైలు జీవితం గుర్తు వస్తున్నట్లుంది.. మళ్లీ అక్కడికే వెళ్లాలని అనుకుంటున్నాడేమో. నాకు కూడా చంచల్గూడ జైలు జీవితం గుర్తుంది. తెలంగాణ ఉద్యమం కోసం జైలుకు పోయాం. ఆయనకు చర్లపల్లినే గుర్తు ఉంటది మళ్లీ యాది చేసుకంటున్నాడు. సీఎం రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై ఆరోపణల చేసిన ప్రతి అక్షరం రికార్డుల నుంచి తొలగించాలి అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
నేను చాలెంజ్ వేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిరూపించినా.. నేను ఈ సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోతా.. రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా..! నిరూపించకపోతే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి.. పదవులకు రాజీనామా చేయాలి. తాను తన చాలెంజ్కు సిద్ధంగా ఉన్నానని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనపై ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. ఈ మూడింటింలో కోర్టు నిర్దోషిగా తేల్చింది. తెలంగాణ ఉద్యమం కేసులు తప్ప.. వేరే కేసులు లేనే లేవు. పెట్రోల్ బంక్లో దొంగతనం కేసు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని కోమటిరెడ్డి అన్నారు. వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయండి. నిజమని తేలితే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తాను. నిరూపించకపోతే సీఎం, మంత్రి కూడా ముక్కునేలకు రాసి రాజీనామా చేయాలి అని జగదీవ్ రెడ్డి సవాల్ విసిరారు.