Telangana । ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చాయని, కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. తెలంగాణ తల్లి నిలువెత్తు విగ్రహాన్ని సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్ఫురిస్తోందన్నారు. డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు.. ఒక పండుగ రోజని, ఈ రోజు మన ఆలోచనలన్నీ అమ్మ చుట్టూనే ఉండాలని ఒక పండుగలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎవరికైనా గుర్తింపు తల్లితోనే
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు.. అవమానించారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి అన్నారు.
టీజీ.. ఉద్యమకాలం నాటి ఆకాంక్ష
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని, అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని, ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో కవి అందెశ్రీని సన్మానించుకోవడం తనకు జీవితకాలం గుర్తుండే సందర్భమని చెప్పారు.
వారికి 300 గజాల స్థలం, కోటి నగదు
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించాలని, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోందని, వారికి 300 గజాల ఇంటి స్థలంతోపాటు రూ.కోటి నగదు, తామ్ర పత్రం అందించనున్నామని తెలిపారు. ‘కొంతమందికి బాధ, ఆవేదన, దుఃఖం ఉండొచ్చు. వాళ్ల రాజకీయ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరమని వాళ్లు అనుకోవచ్చు. కానీ ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో మనం తెలంగాణ సాధించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు ఎదుర్కొన్నాం.. తెలంగాణలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం. ఇక అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఉండకూడదని ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం’ అని రేవంత్రెడ్డి చెప్పారు.