విధాత, మెదక్ బ్యూరో: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా, ఖాళీల జాబితా ఆన్లైన్లో ప్రదర్శించాలని వాటిలో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలని అన్నారు.
జిల్లాలో ఉపాధ్యాయుల కోసం తాత్కాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
మేడ్చల్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీష్ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల్లో పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, డైరెక్టర్ దేవాసేన, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా విద్యాశశాఖాధికారి రమేష్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.