హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో వైట్ బెంగాల్ టైగర్ అభిమన్యు మృత్యువాత పడింది. తొమ్మిదేండ్ల వయసున్న ఈ తెల్ల పులి నెఫ్రిటిస్ అనే కిడ్నీ జబ్బుతో గతేడాది ఏప్రిల్ నుంచి బాధపడుతోంది. చివరకు రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో మంగళవారం మధ్యాహ్నం చనిపోయింది. ఈ మేరకు జూ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అభిమన్యు మృతిపట్ల అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అరుదైన తెల్ల పులి 2015, జనవరి 2వ తేదీన నెహ్రూ జూపార్కులోనే బద్రీ, సురేఖకు జన్మించింది. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అభిమన్యుకు ఎప్పటికప్పుడు వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు. ఎండల తీవ్రతతో పులి ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది. ఈ నెల 5వ తేదీ నుంచి అది కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. మే 12వ తేదీ నుంచి ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేసింది. చివరకు మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం హైదరాబాద్ జూలో 18 పులులు ఉండగా, అందులో 8 తెల్ల పులులు ఉన్నాయి.