Excise Constable Soumya| సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పరిహారం

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నష్ట పరిహారం, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.

విధాత, హైదరాబాద్ : గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి నష్ట పరిహారం, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సౌమ్య మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సౌమ్య అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు

ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్క రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు.

ఎక్సైజ్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.  నిజామాబాద్‌లో జనవరి 23న గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి, తొక్కించేయడంతో సౌమ్య హైదరాబాద్-పంజాగుట్ట నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లా మొస్రా గ్రామం.

Latest News