విధాత: ఆర్జీయూకేటీ(రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2021-2022 విద్యా సంవత్సర ప్రవేశ పరీక్షకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 21,500 దరఖాస్తులు అందాయని సెట్ కో కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వి గోపాలరాజు తెలిపారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేశామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20న ప్రారంభమైందన్నారు. ఇప్పటి వరకు 23,500 మంది పరీక్ష ఫీజు చెల్లించారని వారి నుంచి దరఖాస్తులు అందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 6 సాయంత్రం 5 గంటల వరకు సాధారణ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని 7 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అదనంగా రూ.1000 ఆలస్య ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. సుమారు 50 వేల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.