విధాత : ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని మాట్లాడిన వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరుసటి రోజు ఆదివారం మాట మార్చి ఎగ్జిట్ పోల్స్ అన్ని గందరగోళంగా ఉన్నాయని నాలుక మడతేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా ఉన్నాయని, లోకల్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, జాతీయ సంస్థల సర్వేలు మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయని చెప్పాయన్నారు.
టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉండటం వల్లే ఆ ప్రభావం కనిపించిందని, బీజేపీ 400 సీట్ల టార్గెట్కు అనుగుణంగా నేషనల్ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కోసం అడ్డదిడ్డంగా అంకెలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. వైసీపీకి ఆరా మస్తాన్ సర్వే 150 సీట్లు వస్తాయని ఏమీ చెప్పలేదని, కానీ ఆరా మస్తాన్ సంస్థ అంచనాల కంటే ఎక్కువే సీట్లే వైసీపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ సంబరాలు చేసుకుంటుందని… అవి కేవలం అంచనాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు చేయాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా అధికారులను మేనేజ్ చేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. అందుకే కౌంటింగ్ సందర్భంగా వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.