Water Supply | హైదరాబాద్ నగర ప్రజలకు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. ఈ నెల 7, 8 తేదీల్లో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్ చేయనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 8న రాత్రి 8 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తాగునీటిని వృథా చేయొద్దని సూచించారు.
నీటి సరఫరా బంద్ అయ్యే ప్రాంతాలివే..
మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవులతో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. షేక్పేట జలాశయానికి నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. భోజగుట్ట ప్రాంతానికి తక్కువ పీడనంతో నీటి సరఫరా చేస్తామన్నారు. ఇక ట్రాన్స్మిషన్ I, II పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్లోని 35 ఏళ్ల నాటి హై టెన్షన్ ఎలక్ట్రికల్ ప్యానెల్లను తొలగించి కొత్త ప్యానెల్లను అమర్చనున్నారు. ఈ నేపథ్యంలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. దీంతో పాటు పెద్దాపూర్ నుండి సింగపూర్కు వెళ్లే 1600 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్లైన్లోని ఎయిర్ వాల్వ్లను, అలాగే సింగపూర్ నుండి పెద్దాపూర్కు వెళ్లే 2000 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్ పైప్లైన్లోని ఎయిర్ వెంట్ల మరమ్మతులు చేపట్టామన్నారు.
ఈ పనులన్నీ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 8న రాత్రి 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
