Goods Train Derailed | ఏపీలోని అనకాపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు తాడి-అనకాపల్లి స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారు జామున 3.35 గంట సమయంలో పట్టాలు తప్పింది. దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం – విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ను రెండుమార్గాల్లో బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు. ఇక విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నది. విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ రైలు 8.45 గంటలకు బయలుదేరి వెళ్లింది. విశాఖపట్నంతో పాటు దువ్వాడ రైల్వేస్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.