మిఠాయిలు తినడంలో మజానే వేరు! అందులోనూ నోట్లో వేసుకుని గుటుక్కున మింగేసే గులాబ్జాం సంగతే వేరు! నోట్లో వేసుకోగానే మెత్తగా ఉండి గొంతులో కరిగిపోయే ఆ స్వీటు.. స్వీట్ల ప్రియులకు హాట్కేకు! ఇలానే చెన్నైలో ఒక మిఠాయి ఫేవరేట్.. తన ఫేవరెట్ గులాబ్జామ్ను ఆర్డర్ ఇచ్చాడు. కానీ.. తినేందుకు సిద్ధమవుతుండగా.. దాని పరిస్థితిని చూసి నిర్ఘాంతపోయాడు. తనకెదురైన ఆ భయానక అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆ విజువల్ కొంత ఇబ్బందికరంగానే ఉన్నది.
సదరు వ్యక్తి ఆర్డర్ ఇచ్చిన గులాబ్జామ్ నుంచి ఒక తెల్లటి సన్నటి పురుగొకటి.. కదలాడుతూ కనిపిస్తున్నది. ‘ఇక్కడ ఓ పురుగు నట్యం చేస్తున్నది.. బాగా నిరాశపడ్డాను’ అని అతడు ఆ వీడియోకు కామెంట్ జోడించాడు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందనే వచ్చింది. కొందరు ఈ అంశాన్ని ఊరికే వదిలిపెట్టొద్దని, కన్స్యూమర్ కోర్టులో తేల్చుకోవాలని సలహా ఇచ్చారు. ఈ వీడియో చూస్తేనే భయానకంగా ఉన్నదని, ఇక నేరుగా చేస్తే పరిస్థితి ఏంటని కొందరు వ్యాఖ్యానించారు.
కొందరు సదరు రెస్టారెంట్ను ట్యాగ్ చేస్తూ.. తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఫుడ్ సేఫ్టీ, అండ్ స్టాండర్డ్స్ చట్టంలోని సెక్సన్ 56 ప్రకారం.. అపరిశుభ్రమైన ఆహారం అందించినా, కుళ్లిపోయినవి ఇచ్చినా లక్ష రూపాయల వరకూ దావా వేయవచ్చని మరొకరు సలహా ఇచ్చారు. కొత్త భయం మొదలైందని అని ఒకరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా.. మీరు బయటి దుకాణాల్లో స్వీట్లు కొన్నప్పుడు చెక్ చేసుకుని మరీ తినడం మర్చిపోకండి.