Google Pay | ఈ ఆధునిక యుగంలో బ్యాంకులకు వెళ్లకుండా ఇతరులకు డబ్బులు పంపించడం తేలిగ్గా మారింది. గతంలో డబ్బులు పంపాలంటే కష్టంగా ఉండేది. ఇటీవల కాలంలో యూపీఐ సేవలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి అనంతరం యూపీఐ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న యాప్లలో గూగుల్ పే ఒకటి. కోట్లాది మంది వినియోగిస్తున్న గూగుల్ పే సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయి.
భారత్, సింగపూర్ సహా పలు దేశాల్లో ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. జూన్ 4 తర్వాత ఆగిపోతాయని ప్రకటించింది. భారత్లో అత్యధికంగా వినియోగిస్తున్న యాప్ను మిగతా దేశాల్లో చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. దాంతో సేవలను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. గూగుల్ వాలెట్ సేవలను వినియోగిస్తున్న దేశాల్లో సేవలను పెంచబోతున్నది. అమెరికా సహా పలు దేశాల ప్రజలకు టెక్ దిగ్గజం గూగుల్ కీలక సూచనలు చేసింది. జూన్ 4 తర్వాత గూగుల్ పే సేవలు అందుబాటులో ఉండవని.. గూగుల్ వాలెట్కు మారాలని సూచించింది.
అయితే, చాలా దేశాల్లో గూగుల్ పే కన్నా గూగుల్ వాలెట్ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. భారత్లో మాత్రమే గూగుల్ పేను వినియోగిస్తూ వస్తున్నారు. 180 దేశాల్లో గూగుల్ పే స్థానంలో గూగుల్ వాలెట్ వచ్చింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో పేకు బదులు వాలెట్ వినియోగిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో సేవలను నిలిచిపోయినా భారత్, సింగపూర్లో సేవలను యథావిధిగా కొనసాగనున్నాయి. రెండు దేశాల ప్రజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవలు వినియోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది.