హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకున్న నిర్ణయాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ సీఎస్ సెట్టి స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపు సకాలంలో తీసుకున్న నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన మాట్లాడుతూ… “RBI వడ్డీ రేటు తగ్గింపు సత్వరమైన, సమయోచిత చర్య. ఈ నిర్ణయం మార్కెట్కు మద్దతుగా నిలుస్తుంది. అనుకూల విధానం సుంకాల వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఏర్పడే పరోక్ష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటంతో, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం వృద్ధి పథంలో పయనిస్తుంది” అని తెలిపారు. నియంత్రణ విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలను ఆయన ప్రశంసించారు.
“మార్కెట్ ఆధారిత సెక్యూరిటైజేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నిర్వహణ, బంగారం రుణాలపై విధాన సమీక్ష, నాన్-ఫండ్ ఆధారిత సౌలభ్యం వంటివి సమయానుగుణంగా నిర్ణయాలుగా ఉన్నాయి” అని సెట్టి పేర్కొన్నారు. ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.