Christopher Nolan Odyssey | మీరు నమ్మలేరు.. ఆ సినిమా టికెట్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ గరిష్ఠ ధర.. రూ.43,093.95!

సినిమా ఐమాక్స్‌ 70 ఎంఎం టికెట్స్‌ ఈబేలో ఇప్పటికే 500 డాలర్లకు అమ్మతున్నారు. వెంటనే కొనుక్కోండి.. ఐమాక్స్‌లో సినిమా చూసే అవకాశం వచ్చినందుకు గర్వించండి.. అంటూ ఎక్స్‌లో ఒకరు వ్యాఖ్యానించారు. ఐమాక్స్‌ 70 ఎంఎంలో ఒడిస్సీ సినిమా టికెట్లు ఇప్పటికే భారీ రేట్లకు రీసేల్‌ అవుతున్నాయని మరొకరు తెలిపారు.

  • Publish Date - July 19, 2025 / 05:46 PM IST

Christopher Nolan Odyssey | సినిమా విడుదల సందర్భంగా బ్లాక్‌లో రేట్లు పెంచి టికెట్‌లు అమ్ముతుండటం తెలిసిందే. మహా అయితే.. 500 నుంచి వెయ్యి రూపాయల వరకూ ఉంటుంది. భారీ బడ్జెట్‌తో సినిమా తీశామంటూ నిర్మాతలు ప్రభుత్వం నుంచి పర్మిషన్‌ తీసుకుని అధిక ధరలకు బెనిఫిట్‌ షోలు నిర్వహిస్తూ ఉంటారు. తద్వారా తొలి రెండు మూడు రోజుల్లో అధిక ఆదాయం సంపాదిస్తుంటారు. అయితే.. ఒక సినిమాకు టికెట్‌ ధర మాత్రం గరిష్ఠంగా రూ.43,093.95కు అమ్ముడు పోయిందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే.

క్రిస్టోఫర్‌ నోలాన్‌ దర్శకత్వం వహించిన ‘ది ఒడిస్సీ’ అనే సినిమా అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేయగానే.. ఈబేలో అది గరిష్ఠంగా 500 డాలర్లకు హాట్‌కేకులా అమ్ముడు పోయింది. బుకింగ్‌ ఓపెన్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టేయాల్సి వచ్చింది. చివరిలో ఒక నివ్వెరబోయే సంగతి ఉంటుంది.. పూర్తిగా చదవండి.. ఈ సినిమా ఒక జానపద చిత్రం. హోమర్స్‌ రాసిన పురాతన గ్రీక్‌ జానపద నవల ‘ది ఒడిస్సీ’ని సినిమా రూపంలో తీసుకువస్తున్నారు. ఇందులో ఒడిస్సియస్‌ పాత్రను మాట్‌ డామన్‌ పోషించారు. టామ్‌ హోలాండ్‌, అన్నే హాత్‌వే, జెండయా, జాన్‌ బ్రెంతాల్‌, లుపిటా నియోంగ్‌ ఓ, రాబర్ట్‌ పాట్టిసన్‌, చార్జీజ్ థెరోన్‌, మియా గోత్‌ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్‌ కెమెరాలతో చిత్రీకరించారు. ‘ది ఒడిస్సీ’ సినిమా ట్రైలర్‌ను ‘జూరాసిక్‌ వరల్డ్‌ : రీబర్త్‌’ సినిమాతోపాటు విడుదల చేశారు. అనంతరం అది ఆన్‌లైన్‌లోనూ లీక్‌ అయింది.

గురువారం ఈ సినిమా అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేశారు. ఐమాక్స్‌ థియేటర్లలో లిమిటెడ్‌ సీట్స్‌ ఉంటాయని ప్రకటించారు. దీంతో అభిమానులు పోటెత్తారు. గంట వ్యవధిలోనే అన్ని లొకేషన్లలోని థియేటర్ల టికెట్లన్నీ కొనేశారు. దీని ద్వారా సినిమా నిర్మాతలకు దాదాపు 1.5 మిలియన్‌ డాలర్లు అంటే.. సుమారుగా 12.92 కోట్ల రూపాయలు లభించాయి. సగటున ఒక్కో టికెట్‌ 25 డాలర్ల నుంచి 28 డాలర్ల వరకూ అమ్ముడు పోయినట్టు తెలుస్తున్నది. అక్కడ ఒక ట్విస్ట్‌ ఉన్నది.

బుకింగ్‌ క్లోజ్‌ అయిపోయిన గంటల వ్యవధిలో ఆ టికెట్లు ఈబే వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అధిక ధరలకు అమ్ముతామంటూ ప్రత్యక్షమయ్యాయి. ఈ సినిమాకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో కొంత మంది ఒక్కో టికెట్‌ను 500 డాలర్లకు అమ్మకానికి పెట్టినవారూ ఉన్నారు. న్యూయార్క్‌లోని ఏఎంసీ లింకన్‌ స్క్వేర్‌లో స్క్రీనింగ్‌కు నాలుగు టికెట్ల సెట్‌ వెయ్యి డాలర్లకు (రూ.86,145) అమ్మకానికి పెట్టారని ఫాన్‌డోమ్‌వైర్‌ పేర్కొంటున్నది. డాలస్‌లోని ఒక థియేటర్‌లో ఎడమవైపు రెండో వరుసలో చివరి సింగిల్‌ సీటు దాని ఒరిజినల్‌ ధర కంటే 400 శాతం అధిక ధరకు లిస్ట్‌ చేశారని తెలిపింది. ది ఒడిస్సీ సినిమా ఐమాక్స్‌ 70 ఎంఎం టికెట్స్‌ ఈబేలో ఇప్పటికే 500 డాలర్లకు అమ్మతున్నారు. వెంటనే కొనుక్కోండి.. ఐమాక్స్‌లో సినిమా చూసే అవకాశం వచ్చినందుకు గర్వించండి.. అంటూ ఎక్స్‌లో ఒకరు వ్యాఖ్యానించారు. ఐమాక్స్‌ 70 ఎంఎంలో ఒడిస్సీ సినిమా టికెట్లు ఇప్పటికే భారీ రేట్లకు రీసేల్‌ అవుతున్నాయని మరొకరు తెలిపారు. ఐమాక్స్‌ 70ఎంఎం తెర కలిగిన థియేటర్లు ప్రపంచ వ్యాప్తంగా పాతిక మించి లేకపోవడం కూడా ఆన్‌లైన్‌లో రీసేల్‌కు కారణమైనట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదేం వేలం వెర్రి అంటూ తిట్టిపోసినవారూ ఉన్నారు. ఇంతకీ ట్విస్ట్‌ ఏమింటే.. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే.. 2026 జూలై 17న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల రీసేల్‌పై నిర్మాణ సంస్థ యూనివర్సల్‌ పిక్చర్స్‌ నుంచి ఎలాంటి స్పందనలేదని తెలుస్తున్నది.