Hanuman Chalisa | ప్రతి మంగళవారం హిందూవులు ఆంజనేయుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. హనుమాన్ ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. పూజల సందర్భంగా హనుమాన్ చాలీసాను పఠిస్తుంటారు. హనుమాన్ చాలీసా చదివితే స్వామి అనుగ్రహం, బలం, రక్షణ, జ్ఞానం లభిస్తుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. అయితే హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడు పొరపాట్లు చేయొద్దని పండితులు సూచిస్తున్నారు. అసలు ఏ సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది..! మధ్యలో ఆపొచ్చా..? అనే విషయాలను తెలుసుకుందాం.
హనుమాన్ చాలీసాను పఠించడానికి బ్రహ్మ ముహూర్తం అనువైన సమయంగా చెబుతున్నారు పండితులు. అంటే.. తెల్లవారుజామున చదవాలి. ఎందుకంటే.. ఈ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని ప్రారంభించడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరింత పెరుగుతాయంటున్నారు పండితులు.
చాలా మంది హనుమాన్ చాలీసా చదివేటప్పుడు వేగంగా పూర్తి చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాకాకుండా తగినంత సమయాన్ని వెచ్చించి తొందరపడకుండా నెమ్మదిగా చదవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు పండితులు. ఒకసారి హనుమాన్ చాలీసాను పఠించడం ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపకూడదంటున్నారు పండితులు. అంటే.. నిరంతరంగా అది కంప్లీట్ అయ్యే వరకు చదవాలని సలహా ఇస్తున్నారు.