Mohanlal | మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్ తల్లి శాంతకుమారి (90) మంగళవారం కన్నుమూశారు. గత దాదాపు పదేళ్లుగా పక్షవాతం సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.శాంతకుమారి భర్త దివంగత విశ్వనాథన్ నాయర్, మాజీ లీగల్ సెక్రటరీగా సేవలందించారు. ఆమె చివరి సమయంలో సంరక్షకులు ఆమె వెంట ఉన్నట్లు సమాచారం. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే మోహన్లాల్ ఎర్నాకుళంలోని తన ఇంటికి చేరుకున్నారు. శాంతకుమారి పార్థివదేహాన్ని ఈ రాత్రి తిరువనంతపురం తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు.
శాంతకుమారి చాలా కాలంగా తిరువనంతపురంలోని ముదవన్ముగల్ కేశవదేవ్ రోడ్డులో ఉన్న ‘హిల్వ్యూ’ అనే ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె చికిత్సలు అమృత ఆసుపత్రిలో కొనసాగాయి. గతంలో ఆమె 89వ పుట్టినరోజు సందర్భంగా మోహన్లాల్ ఎలమక్కరలో ప్రత్యేకంగా ఒక సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేయడం అప్పట్లో అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. ఇదిలా ఉండగా, మోహన్లాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే సినీరంగానికి అందించిన విశేష సేవలకు గానూ ఆయనకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. మలయాళంతో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విశేషమైన అభిమానాన్ని సంపాదించారు.
మోహన్లాల్ తల్లి మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ చివరిగా వృషభ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. వరుస చిత్రాలతో మంచి జోష్ మీదున్న మోహన్ లాల్కి ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి కలెక్షన్స్ చాలా తక్కువగా వచ్చాయి.
