London Unites for Alai Balai 2025 – A Festival of Culture, Unity, and Togetherness
లండన్, అక్టోబర్ 5 (విధాత):
దసరా వేడుకల సందర్భంగా సీకా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లండన్లో రెండో సంవత్సరం ‘అలయ్ బలయ్’ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, అట్టహాసంగా జరిగింది. కుల, మత, రాజకీయ, ప్రాంత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల తెలుగు ప్రజలు ఒకే వేదికపై కలసి సాంస్కృతిక ఐక్యతను చాటారు.
ప్రవాస జీవితంలో వృత్తి, రాజకీయాలు, వ్యక్తిగత పనుల వల్ల దూరమైన ఎన్ఆర్ఐలు ఈ వేదిక ద్వారా మళ్లీ ఒక్కటయ్యారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలు, ముఖ్యంగా పిండివంటలు భారతదేశం నుండి తెప్పించి అందరూ రుచిచూసేలా చేశారు. గ్రామీణ ఉత్సాహం, సంగీతం, నృత్యాలు లండన్ గగనంవీధుల్లో ప్రతిధ్వనించాయి.
జబర్దస్త్ ఫేమ్ కెవ్వు కార్తీ తన హాస్యంతో ప్రేక్షకులను అలరించగా, భారతదేశం నుండి ప్రత్యేకంగా వచ్చిన లాయర్, మోటివేషనల్ స్పీకర్ నాగేశ్వరరావు పూజారి ఆధునిక జీవన ఒత్తిడిపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. సౌతాల్–ఈలింగ్ మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ ముఖ్య అతిథిగా హాజరై — “సాంస్కృతిక ఐక్యత కోసం చేసిన ఈ ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం” అని అన్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీల ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని, “ఇది నిజమైన ఐక్యతా వేదిక” అని అభినందించారు. “ఇరవై ఏళ్ల తర్వాత పాత స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. వృత్తి కారణంగా దూరమైన బంధాలు మళ్లీ పునరుజ్జీవించాయి” కొంతమంది పాల్గొన్న వారు భావోద్వేగం వెలిబుచ్చారు.
వందలాది ప్రవాస భారతీయులు వంటకాలు, సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆనందంగా గడిపారు. “మూడవ సంవత్సరం వేడుకలు మరింత పెద్ద స్థాయిలో జరుపుతాం” అని తె నిర్వాహకులు తెలిపారు.