Site icon vidhaatha

Bandi sanjya kumar । హామీలు అమలుచేయలేక చర్చను దారి మళ్లించేందుకే హై‘డ్రామా’లు : బండి సంజయ్

Bandi sanjya kumar । ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ (Hydra) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హై డ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు (membership registration program) కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్నారు. హైడ్రా పేరుతో సామాన్యులను (common people) కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను మొదట హైడ్రాకు సపోర్ట్ చేసిన. పెద్దలు అక్రమంగా కట్టుకున్న భవనాలను, విల్లాలను, ఫాంహౌజ్‌లు కూలిస్తే సమర్ధించిన. కానీ పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే షాపులను, పేదల ఇండ్లను కూలుస్తున్నరు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరు సరికాదు. ఎందుకీ హైడ్రామాలు? అక్రమ భవనాలకు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడెందుకు కూలుస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

‘బీఆరెస్ (BRS) అవుట్‌డేటెడ్‌ పార్టీ. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్‌కు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదు. బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నాడు. చేతనైతే వరదలవల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలి. రాష్ట్రమంతా భారీ వర్షాలు (rains), వరదలతో అతలాకుతలమవుతుంటే కేసీఆర్ (KCR) కనీసం ఎందుకు స్పందించడం లేదు? ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా సీఎంతో మాట్లాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వరద బాధితులను పరామర్శించలేదు? కనీసం ఎందుకు స్పందించడం లేదు? అందుకే ప్రజలంతా ఆయనకు ‘ నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు.’’ అని అన్నారు.

Exit mobile version