Ayodhya
విధాత: అయోధ్య (Ayodhya) లో నిర్మితమవుతున్న భవ్య రామ మందిరానికి భక్తులు తమ ఓపిక కొద్దీ విరాళాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీగఢ్కు చెందిన ఓ తాళాల వ్యాపారి రాములవారికి ఇచ్చిన బహుమతి ఆశ్చర్యపరుస్తోంది. సుమారు 400 కేజీల భారీ తాళం కప్ప (Huge Key Set) ను ఆయన గుడికి విరాళంగా అందించారు. అలీగఢ్కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ రాముడికి పరమ భక్తుడు. వీరి కుటుంబం ఏకంగా ఒక శతాబ్దం నుంచి తాళాల తయారీ రంగంలోనే ఉంది.
ప్రకాశ్ శర్మ కూడా 45 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. అయోధ్య ఆలయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఓ తాళం కప్పను, చెవిని తయారుచేయాలని భావించానని ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఆలయానికి అందించిన తాళం కప్ప 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందంతో ఉంటుందని తెలిపాడు. దీని తాళం చెవి 4 అడుగుల పొడవుంటుందని వివరించాడు.
ఈ తాళాన్ని అలీగఢ్లో జరిగిన ఓ ఎగ్జిబిషన్లో ఈ ఏడాది మొదట్లోనే ప్రదర్శించి, అప్పుడు వచ్చిన స్పందన ఆధారంగా మళ్లీ చిన్న చిన్న మార్పులు చేసి ఏ లోపం లేకుండా దానికి మెరుగులు దిద్దాడు. ఈ తాళం తయారీ క్రతువులో తన భార్య రుక్మిణి కూడా సాయం చేసిందని ప్రకాశ్ శర్మ వివరించాడు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 లక్షలు ఖర్చయిందని తన జీవితంలో కూడబెట్టినదంతా ఖర్చు చేసైనా ఈ తాళాన్ని తయారుచేయాలని భావించానని పేర్కొన్నాడు.