విధాత, ముంబయి: ఓ నిందితుడిని బంగారు దంతాలు (gold-plated teeth) పట్టించాయి. అవును మీరు చదివింది నిజమే..! గత 15 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న అశుభ జడేజాను శనివారం ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ అశుభ జడేజా అనే వ్యక్తి ఓ బట్టల దుకాణంలో సేల్స్మెన్గా పని చేసేవాడు. 2007లో షాప్ యజమానిని మోసం చేసి రూ.40వేలు మోసానికి పాల్పడ్డాడు. పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు తన గుర్తింపును మార్చుకొని గుజరాత్లోని కచ్కు మకాంతో పాటు పేరును సైతం మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు.
నిందితుడిని మోసం, పోలీసులను తప్పుదారి పట్టించడం వంటి అభియోగాలు మోపారు. అరెస్టు చేసిన తర్వాత కోర్టు నిందితుడికి బెయిల్ వచ్చింది. విచారణ తర్వాత నిందితుడు ముంబయి నుంచి పరారయ్యాడు. మళ్లీ కోర్టుకు హాజరు కాలేదు. క్రమంలో అతన్ని కోర్టు పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింద ని పోలీసు అధికారి తెలిపారు.
2007లో ప్రవీణ్ అశుభ ఓ బట్టల దుకాణంలో పని చేసేవాడు. అతని యజమాని మరో వ్యాపారి నుంచి రూ.40వేలు వసూలు చేసుకోవాలని చెప్పాడు. డబ్బును యజమానికి ఇవ్వడానికి బదులుగా.. తన వద్ద నుంచి డబ్బును దొంగిలించారని యజమానితో పాటు పోలీసులను తప్పుదోవ పట్టించాడు. విచారణ అనంతరం ప్రవీణ్ డబ్బును తనవద్దే ఉంచుకొని తప్పుదోవ పట్టించినట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.
ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు తలించారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత పరారయ్యాడు. ఈ క్రమంలో పోలీసులు కొద్దిరోజుల కింద నిందితుని పట్టుకునేందుకు దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో గుజరాత్లోని కచ్ జిల్లాలో నిందితుడి కోసం ఆరా తీశారు.
ఆధార్తో పాటు ఒకే విధమైన పేర్లు, వయసును సరి పోలే వారందరి వివరాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత షాబ్రాయ్ గ్రామంలో కూరగాయల హోల్సేల్ వ్యాపారం చేస్తున్న ప్రదీప్ సింగ్ జడేజాగా ఐడెంటీని మార్చుకున్నది ప్రవీణ్ జడేజా అని గుర్తించి, అరెస్టు చేశారు.
అయితే, నిందితుడి వారెంట్ వివరాలు సరిపోలడంతో పాటు అతనికి రెండు బంగారు పోత పోసిన దంతాలు ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మొదట తాము మొబైల్ నంబర్కు ఎల్ఐసీ అధికారులుగా ఫోన్ చేశామని, పాలసీ మెచ్యూర్ అయ్యిందని, ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు సంతకం కావాలని ఫోన్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
పత్రాలపై సంతకం చేసేందుకు వచ్చిన సమయంలోనే పట్టుకున్నామని, అతని రెండు బంగారు పళ్ళు ఉన్నట్లు ధ్రువీకరించుకున్నామని, ఆ తర్వాత నిందితుడి ఫొటోను అతని యజమానికి పంపామని, యజమాని సైతం అతని ప్రవీణ్ జడేజా అని ధ్రువీకరించారని పోలీస్ అధికారి కుదుమ్ కదమ్ వివరించారు.