విధాత: మెట్రో, ఫార్మాసిటీ రద్దు చెయ్యడం లేదని, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టుకు ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సీఎం, బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుందని, ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో ఉంటుందని పేర్కొన్నారు.
నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కు లింక్ చేస్తూ, మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్ పోర్టుకి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరని, కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందని చెప్పారు.
జీరో కాలుష్యంతో క్లస్టర్లు
ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి, జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి స్థానికంగానే గృహనిర్మాణం కూడా ఉంటుందని, అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయని అన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని, యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన, ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలతో పాటు స్కిల్స్ అదనంగా అందించి, అక్కడ నుంచి బయటకు వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుందన్నారు.
అధికార వికేంద్రీకరణ
మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగించామని, ఇప్పటికే అధికార వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 100 పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఏర్పాటు, విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని, అందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే అవకాశం ఉంటుందన్నారు. మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చాలామంది సీనియర్ అధికారులు, ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందన్నారు.
3న పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని, పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తనకు దగ్గరనో, బంధువులనో పదవులు ఇచ్చేది ఉండదని స్పష్టం చేశారు. ఏదిచేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తామని, పార్టీ కోసం పని చేసిన వారికీ ప్రాధాన్యం తప్పక ఇస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామని, సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. నా వద్ద చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉండదని, ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు.