RBI |
హైదరాబాద్, విధాత: కోర్టు ధిక్కరణ కేసులో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాము ఏప్రిల్ 24న ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంది. జులై 7లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.
బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి 2018 సెప్టెంబర్లో బ్యాంక్ జారీచేసిన సర్యులర్ను సవాలు చేస్తూ ఏపీ మహేశ్ కో ఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ షేర్హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సాగుతోంది.
ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు, వాటాదారుల ప్రయోజనాలను రక్షించడంతోపాటు బ్యాంకు రోజువారీ లావాదేవీలను యథావిధిగా కొనసాగించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఏప్రిల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఇందుకోసం ఆర్బీఐ తనకు నచ్చిన అధికారిని నియమించుకోవచ్చని తెలిపింది. అయితే ఇప్పటివరకు నియమించకపోవడంతో మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ షేర్ హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.
ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పాటించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను జులై 7కి వాయిదా వేసింది.