Congress |
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా జరిపిన మంత్రాంగం రహస్యం ఇదేనని కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత స్థాయి నేతల్లో ఒకరు తెలిపారు. వాస్తవానికి జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి సుమారు 35 మంది ముఖ్యమైన నాయకులతో కలిసి రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఢిల్లీలో ప్రకటించారు.
ఈ మేరకు ఖమ్మంలో మంగళవారం పొంగులేటి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించాల్సి ఉన్నది. అయితే.. జూలై 2న నిర్వహించ తలపెట్టిన సభను తాత్కాలికంగా వాయిదా వేశారని కాంగ్రెస్లోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఈటలతోపాటు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే.. తాను ‘ప్రస్తుతానికి’ బీజేపీలోనే ఉన్నానని ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొనగా.. పార్టీ మారే అవకాశం లేదని ఈటల మంగళవారం ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్లోని ఉన్నతస్థాయి విశ్వసనీయవర్గాలు మాత్రం వీరిద్దరూ కూడా కాంగ్రెస్లో చేరుతారని, ఆ సమయంలోనే పొంగులేటి, జూపల్లి తదితరుల చేరికకు సంబంధించి భారీ సభ నిర్వహించే అవకాశం ఉన్నదని వెల్లడించాయి. ఈ సభకు రాహుల్ తదితర కాంగ్రెస్ పెద్దలు హాజరయ్యే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.
తీగల కూడా కాంగ్రెస్లోకి..?
మహేళ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలుస్తున్నది. గత కొంత కాలంగా మహేశ్వరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల్లో చాలా కాలంగా విభేదాలు కొనసాగు తున్నాయి. అయితే ఇటీవల మహేశ్వరంలో భారీ సభ నిర్వహించిన సీఎం కేసీఆర్ పరోక్షంగా మళ్లీ సబితా ఇంద్రారెడ్డికే మహేశ్వరం టికెట్ అన్నట్లుగా సంకేతాలిచ్చారు.
దీంతో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక వేచి చూడటం కరెక్టు కాదని తీగల భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవల తనకే టికెట్ ఇవ్వాలని, లేదంటే పార్టీ మారడం ఖాయమని తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పెద్దలకు అల్టీమేటం ఇచ్చినట్లు తెలిసింది. గ్రేటర్లో ఇంకా కొంతమంది నేతలు వివిధ నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్నారు. వాళ్లందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యంకాకపోవచ్చు. కాబట్టి తీగలతో పాటు మరికొందరు కారు దిగడం ఖాయమనే చర్చ నడుస్తున్నది.