విధాత: ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో నేటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు చేశామని అదనపు కలెక్టర్ రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగులు చేయడానికి గత నెల 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే మొదలు రైతుల నుంచి శరవేగంగా ధాన్యం కొనుగోలు చేసి ఏ గ్రేడ్ ధాన్యం 2060, సాధారాణ రకం 2040 మద్దతు ధర చెల్లించామని ఆయన తెలిపారు. మరో వారం, పది రోజులలోగా పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో గన్ని సంచులు, లారీల కొరత వంటి కొన్ని సమస్యలు ఎదురైనా అందరి సహకారంతో వాటిని అధిగమించామన్నారు.
రైతులు నాణ్యత ప్రమానాలకనుగుణంగా ధాన్యం కేంద్రాలకు తేవడం, మిల్లు యాజమానులు హమాలీలను ఎక్కువగా పెట్టడం, కేంద్రం నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. అదేవిధంగా స్థలాభావం ఉన్న శివ్వంపేట, నరసాపూర్, తూప్రాన్, చేగుంట, వెల్దుర్తి మండలాల ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం, మిగతా ధాన్యాన్ని గతంలో మాదిరే గోదాములు, ఇతర ప్రైవేట్ ప్రాంతాలలో నిలువ చేశామని తెలిపారు.
జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 56,658 మంది రైతుల నుంచి రూ.571 కోట్ల విలువ గల 2 లక్షల 78 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 228 కోట్లు వేశామని రమేష్ తెలిపారు. ఇంతవరకు 90 శాతం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, మిగతా ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని అన్నారు.