Kamareddy
విధాత: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కుమార్తెలు, కుమారుడు కర్కశకంగా ప్రవర్తించారు. ఆస్తి తమ పేర రాయాలంటూ.. ఏ మాత్రం కనికరం లేకుండా ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ వృద్ధురాలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఈ అమానుష ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కిష్టవ్వ(70) భర్త కొన్నేండ్ల క్రితం మరణించాడు. కిష్టవ్వకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఒక బిడ్డ చనిపోయింది. ఇక ఉన్న ముగ్గురు కూడా కామారెడ్డిలోనే సెటిల్ అయ్యారు. అయితే కిష్టవ్వ పేర ఇల్లు, బ్యాంకు ఖాతాలో రూ.1.70 లక్షల నగదు ఉంది.
ఇల్లు, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఇవ్వాలంటూ కుమారుడు, కోడలు, కూతుర్లు కలిసి తల్లిపై దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధురాలిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన గత నెల 21న చోటు చేసుకుంది.
వృద్ధురాలు కిష్టవ్వ చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది. దీంతో కిష్టవ్వ కుటుంబ సభ్యులకు డాక్టర్లు సమాచారం అందించారు. కానీ తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఇప్పటి వరకు కూడా బిడ్డలు, కుమారుడు రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిష్టవ్వ డెడ్బాడీని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు.