విధాత: మొత్తానికి తప్పనిసరి పటిస్థితుల్లో కన్నా లక్ష్మీనారాయణ కాసేపట్లో టీడీపీలో చేరుతున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లి నుంచి ఆరుసార్లు గెలిచి కాంగ్రెస్ జమానాలో మంత్రిగా పని చేసిన ఈ కాపు నాయకుడు భారీగా మద్దతుదారులతో కలిసి టీడీపీలో చేరుతున్నారు.
వాస్తవానికి ఆయన జగన్ పార్టీలో చేరాలని కోరుకున్నారట. ఇక్కడ సత్తెనపల్లి టికెట్ అడిగారట.. అయితే అక్కడ ఆల్రెడీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. మొదటి నుంచి తన వెంట ఉన్న అంబటిని కాదని కొత్తగా వచ్చిన కన్నాకు టికెట్ ఇవ్వడానికి జగన్ ఒప్పుకోలేదు.
అందుకే కన్నాకు వైసీపీలోకి ఎంట్రీ దక్కలేదని అంటున్నారు. ఇక బీజేపీలో నిలువ నీడ లేదు. కాంగ్రెస్కు భవిష్యత్ లేదు. ఈ తరుణంలో ఆయనకు టీడీపీ తప్ప మరో అవకాశం లేనందున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు తెలిసింది.
ఆర్థికముగా బలవంతుడు ఐన కన్నా ఈసారి అంబటి రాంబాబును సత్తెనపల్లిలో ఎదుర్కోనున్నారు. అంబటి కూడా కులపరంగా బలవంతుడే. ఆ చుట్టుపక్కల మండలాల్లో ఆయనకు గట్టి పరిచయాలు.. బంధుత్వాలు ఉన్నాయ్. కాబట్టి ఈసారి సత్తెనపల్లి పోరు రసవత్తరంగా ఉండబోతుంది.
అయితే ఈమధ్య కాలంలో అంబటి మీద పలు వ్యక్తిగత, అవినీతి ఆరోపణలు ముప్పిరిగొన్నాయి. ఇవి ఎన్నికల నాటికి ఎలా ఉంటాయో చూడాలి. ఏదైతేనేం.. ఈసారి అంబటికి గట్టి పోటీ ఉండబోతోంది.