YS Sharmila : టీటీడీ గుడులకు సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఎందుకు ?

వైఎస్ షర్మిల టీటీడీ గుడుల ప్రోత్సాహంపై చంద్రబాబు సీఎం ప్రమోషన్ ఎందుకు దళిత వాసుల మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి.

Ys Sharmila

అమరావతి : దళితవాడల్లో 5000 గుడులను టీటీడీ తరుపున కట్టిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నించడంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు విమర్శించడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిల తప్పుబట్టారు. 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు, దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్ రూమ్ ఉందని పేర్కొందని… దానిపై దృష్టి పెట్టండని మేము అడగడం తప్పా ? కనీసం రోడ్లు ,డ్రైనేజీ కూడా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా ? ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా ? అని షర్మిల మరోసారి ప్రశ్నించారు. టీటీడీ నిధులతో టీటీడినే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండబోదన్నారు. మేము లేవనెత్తిన సమస్యల్లా టీటీడీ నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ చేసుకోవడం ఏంటని మాత్రమనన్నారు. సీఎం ఓ మతానికి పెద్ద దిక్కులా మాట్లాడకూడదని.. తాను ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలన్నారు. బీజేపీతో కలిసిన సీఎం చంద్రబాబు మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదనే మా ప్రశ్న అని షర్మిల పేర్కొన్నారు. ప్రజల పక్షాన మా డిమాండ్ లో మంచిని వెతకకుండా చంద్రబాబు రాజకీయం చేయడం తగదన్నారు.

హిందూ వ్యతిరేకులుగా ఆరోపణలు

నేను మాట్లాడిన అంశాన్ని పక్కదోవ పట్టించి..మేమేదో హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా నాపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు విష ప్రచారం చేస్తున్నారన్నారు. హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారు. పీఠాధిపతులతో తిట్టిస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మతతత్వ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదులు ఆపాదిస్తున్నారు. మత రాజకీయాలు చేసి లబ్ది పొందేందుకు వారు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మానికి, మతానికి, నేను గానీ కాంగ్రెస్ పార్టీ అని ఎంత మాత్రం వ్యతిరేకం కాదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతం. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే,భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇది ఘోర అపచారం అని, వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని మొదట డిమాండ్ చేసింది నేనే అని షర్మిల గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే టీటీడీని లాగకుండా.. మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

 

Exit mobile version