CM Chandrababu | ‘మొంథా’ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రానికి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

అమరావతి :

రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుఫాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని… 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని… తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సీఎం సూచించారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా చేపట్టాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని సీఎం తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.