విధాత: సిద్ధిపేట జిల్లా కేసీఆర్ నగర్లో మంత్రి హరీశ్రావు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ నగర్లో33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణ పనులకు, నమస్తే తెలంగాణ గ్రంథాలయం, అనంతరం కేసీఆర్ నగర్ పోచమ్మ దేవాలయ ఆవరణలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు.
అలాగే గుండ్ల చెరువుకు లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పోలీసు ఔట్ పోస్ట్ ను ప్రారంభించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ రోజాశర్మ, పోలీసు కమిషనర్ శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
ఆయుత చండీ యాగంలో పాల్గొన్న మంత్రి
సిద్దిపేట పట్టణంలోని వేముల వాడ కమాన్ వద్ద శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వారి పర్యవేక్షణలో జరుగుతున్న శ్రీ కృష్ణ కాల చక్ర ఆయుత చండీ యాగంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
78వ విశ్వ శాంతి యాగం సందర్భంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకాన్నినిర్వహిస్తున్న శ్రీరామ పాదుకలకు నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో ఈ యాగం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మికతకు నెలవుగా సిద్దిపేట ప్రసిద్ధి అని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ యాగం నిర్వహిస్తున్నారని కొనియాడారు. లోక కళ్యాణార్థం చేసే ఈ యాగ ఫలం సిద్దించాలని మంత్రి ఆకాంక్షించారు.