Puttur MLA Sanjeeva
- ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పి
- మార్ఫింగ్ చేశారంటున్న ఎమ్మెల్యే
- చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
- బీజేపీలోని వారి పనేనని పలువురి అనుమానం
విధాత: కర్ణాటక ఎన్నికల్లో ఇప్పటికే తలనొప్పులు ఎదుర్కొంటున్న బీజేపీకి మరో కొత్త సమస్య ఎదురైంది. దక్షణ కన్నడ జిల్లా పుత్తూరు నియోజవకర్గం బీజేపీ ఎమ్మెల్యే సంజీవ (Puttur MLA Sanjeeva) మతందూర్విగా చెబుతున్న కొన్ని అభ్యంతరకర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. గుర్తు తెలియని మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న సెల్ఫీలుగా అవి ఉన్నాయి.
అయితే.. తనను దెబ్బకొట్టేందుకు కొందరు మార్ఫింగ్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని, తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో తలపట్టుకుంటున్నది. సదరు ఫొటోల్లో పుత్తూరు ఎమ్మెల్యే సంజయ్ మతందూర్ జాలీగా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నారు. అయితే.. ఈ ఫొటోలు బీజేపీలోని వారి పనేనని కొందరు అంటున్నారు.
మతందూర్ మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో భాగంగానే ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయని చెబుతున్నారు.
ఈ సీటు కోసం మతందూర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పుత్తూరును గెలవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మతందూర్ 19వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
గతంలో కూడా మతందూర్ వ్యక్తిగత వీడియో ఒకటి ఇలానే బయటకు వచ్చింది. క్షేత్రస్థాయిలో మతందూర్ మంచి పనులే చేశారని, కానీ, బీజేపీ నాయకత్వంతో పాటు ఆరెస్సెస్ పెద్దలు కూడా ఆయన పట్ల సానుకూల వైఖరితో లేరని చెబుతున్నారు.
ఫొటోల ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్ గానే పరిగణిస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అవినీతి కేసులో బీజేపీ ఎమ్మెల్యే మండల్ విరూపాక్ష అరెస్టు నుంచి బీజేపీ ఇంకా కోలుకోని సమయంలో తాజాగా మతందూర్ ఫొటోలు కొత్త బాంబు పేల్చాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.