విధాత, హైదరాబాద్: అసెంబ్లీ మీటింగ్ హాలులో ఇవాళ ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించగా, మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలో సమగ్ర కుల గణన, షెడ్యుల్డు కులాల వర్గీకరణ నివేదికకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ తరువాత అసెంబ్లీ, కౌన్సల్ లో ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని నిర్ణయించారు. అయితే ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ వర్గీకరణ కమిషన్ పలు సిఫారసులు చేసింది.
కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గ సబ్ కమిటీ ఆమోదించింది. షెడ్యూల్డు కులాల్లో మొత్తం 59 ఉప కులాలు ఉన్నాయి. గ్రూపు 1 లో 15 ఉప కులాలకు 1 శాతం రిజర్వేషన్ (15 ఉప కులాల జనాభా 3.288), గ్రూపు 2 లోని ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్ (18 ఉప కులాల జనాభా 62.748 శాతం), గ్రూపు 3 లోని 26 ఉప కులాలకు 5 శాతం రిజర్వేషన్ (26 ఉప కులాల జనాభా 33.963శాతం) కల్పించాలని కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో వర్గీకరణతోనే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది.