KCR Hosts Ministers Seethakka and Konda Surekha at Erravelli Farmhouse
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
KCR Welcome | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం ఇద్దరు మహిళా మంత్రులు—ధనసరి సీతక్క, కొండా సురేఖ ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కలిసి మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. అయితే ఈ భేటీ రాజకీయ పరిమితులను దాటి, కేసీఆర్ కుటుంబానికే ప్రత్యేకమైన ఆతిథ్య సంస్కారాన్ని సంతరించుకోవడం విశేషం.
మంత్రులు ఫాంహౌస్కు చేరుకోగానే వారికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ పూల మొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం సీతక్క–సురేఖలను కేసీఆర్–శోభమ్మ దంపతులు ఇంటి లోనికి ఆహ్వానించారు. ఇద్దరినీ, బాగున్నారా అమ్మా..! అంటూ మర్యాదపూర్వకంగా పలకరించి ఇంటికి వచ్చిన ఆ ఆడపడుచులకు సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, చీరెసారె అందజేయడం—కేసీఆర్ కుటుంబం అనుసరించే సంప్రదాయ ఆతిథ్యాన్ని ప్రతిబింబించింది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, అతిథిగా వచ్చిన వారిని గౌరవించడమనే సంస్కార సంప్రదాయం కేసీఆర్ ఇంట్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
మంత్రులు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేయగా, శోభమ్మ దంపతులు దానిని పసుపు–కుంకుమలతో స్వీకరించారు. అనంతరం మంత్రులతో టీపానీయాల సమయంలో జాతర ఏర్పాట్లు, భక్తుల రద్దీ, దేవతల గద్దెల అభివృద్ధి పనులపై సరళమైన చర్చ జరిగింది. మొత్తం భేటీ వ్యవధిలో రాజకీయ వ్యాఖ్యలు చోటుచేసుకోకపోవడం, పూర్తిగా స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం ప్రత్యేకతగా నిలిచింది.
మేడారం ఆహ్వానం నేపథ్యం – కుటుంబ ఆతిథ్యం ప్రధానం
మేడారం జాతరం రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన ఉత్సవం కావడంతో ప్రభుత్వం తరఫున ఆహ్వానించడానికి సీతక్క, సురేఖ వెళ్లారు. కానీ ఈ సందర్భంలో కేసీఆర్ కుటుంబం చూపిన ఆత్మీయత, అతిథ్య సంప్రదాయం భేటీకి మరింత ప్రాధాన్యత తెచ్చింది.
- సంప్రదాయ స్వాగత విధానం
- పసుపు–కుంకుమతో ఆహ్వానం స్వీకరణ
- చీరె – సారెతో సత్కరించడం
- మర్యాదపూర్వక వాతావరణం
ఇవి ఆ ఇంటి సంస్కారాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి.
మేడారం జాతర ఏర్పాట్లు ముమ్మరం
జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోసం ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈసారి భారీ రద్దీ ఉండొచ్చని భావించి రవాణా, భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలపై అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దెల పునర్నిర్మాణ పనులు, ప్రాంగణ విస్తరణ కూడా పూర్తి కావచ్చాయి.
