K Kavitha’s Possible Move to Congress Triggers Fresh Political Buzz in Telangana
విధాత తెలంగాణ డెస్క్ | హైదరాబాద్:
Kalvakuntla Kavitha | తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరతీసింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన చర్చ కొనసాగుతోంది.
కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మీడియాలో తిరుగుతున్నాయి.కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చనే భావనను సూచించే ఆయన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి. గతంలో కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలోకి వస్తారని నేను ముందే చెప్పాననీ, అది నిజమైందని, ఇది కూడా అంతే అంటూ రంగారెడ్డి వ్యాఖ్యానించడం వ్యక్తిగత అంచనాలే తప్ప, ఏ స్థాయిలోనూ అధికారిక సమాచారంగా భావించరాదని కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
కవిత గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ నుండి ఆమె బహిష్కరణ, కుటుంబంలోని అంతర్గత ఉద్రిక్తతలు — ఇవన్నీ కలిసి ఆమె తదుపరి నిర్ణయం ఏమై ఉంటుందన్న కుతూహలాన్ని పెంచుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించిందని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, కవిత తన తరఫున ఎటువంటి కొత్త పార్టీ నిర్ణయం లేదా రాజకీయ దిశపై పబ్లిక్గా ఏమాత్రం సంకేతం ఇవ్వలేదు. అయితే కొత్తపార్టీ పెడుతుందనే ఊహాగానాలు మాత్రం వెలువడుతున్నాయి.
కాగా, నిన్న మండలిలో ప్రజాసమస్యలతో ఏమాత్రం సంబంధం లేని ప్రసంగం చేసి, ఆమె ప్రజల దృష్టిలో పడ్డారు. అందునా తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి చేసిన అసభ్యవ్యాఖ్యలు కూడా సోషల్మీడియాలో కలకలం రేపాయి. కవిత ఆరోపణలు ఆన్రికార్డెడ్గా ఉండాలని ఒక సీనియర్ మంత్రి సూచన ప్రకారమే కవిత మండలిలో తండ్రినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మరో మంత్రి తన అంతరంగికులతో అన్నట్లు తెలిసింది.
కవిత ఇప్పుడు రేవంత్ సంధించిన బాణం : బీఆర్ఎస్ ఆరోపణ
కాంగ్రెస్ అధిష్ఠానంతో కవిత సంప్రదింపులు జరిగాయన్న వార్తలు కొన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ఈ చర్చల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేసినా, ఈ విషయంపై కాంగ్రెస్ వైపు నుంచి ఎటువంటి అధికారిక నిర్వహణ వెలువడలేదు. మంత్రివర్గ విస్తరణల్లో కవిత పేరును పరిశీలించారన్న ప్రచారం గతంలో వచ్చినప్పటికీ, ఆ సమయంలో అది అమల్లోకి రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మద్యం కేసు నేపథ్యంలో కవిత జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందన్న అంశంపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అంతర్గతంగా చర్చించినట్లు అప్పట్లో రాజకీయ వర్గాలు భావించాయి. అయితే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని, మల్రెడ్డి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనే వెలువడినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత ఏ పార్టీ వైపు సాగుతారనే ప్రశ్న ఎప్పటి నుంచో చర్చలోనే ఉంది. మరోవైపు, కవిత కొత్త పార్టీ స్థాపనపై కూడా కొన్ని సమయాల్లో వార్తలు వచ్చినప్పటికీ, వాటిపై కూడా ఆమె స్పందించకపోవడంతో పరిస్థితి మరింత స్పష్టత లేనిదే నిలిచిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం కూడా ఇదే జాబితాలో చేరింది. ఎంఎల్సీగా తన రాజీనామా ఆమోదించబడింది కాబట్టి, తన భవిష్యత్కార్యాచరణ గురించి కవిత ప్రకటిస్తుందని అంచనా. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అంశంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎంతవరకు చేరుతుందన్న విశ్లేషణలు కూడా ఈ నేపథ్యంలో వెలువడుతున్నాయి. కవిత వంటి ప్రముఖ నేత ప్రవేశం ఆ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్న కూడా రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. కవిత భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ను కాల్చాలనేదే రేవంత్ వ్యూహమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు.
ఈ మొత్తం పరిణామాలపై అధికారిక క్లారిటీ వచ్చే వరకు, కవిత కాంగ్రెస్లో చేరతారా? లేక పూర్తి భిన్న దిశలో నిర్ణయం తీసుకుంటారా? అన్న ప్రశ్నలన్నీ ఇప్పటికీ ఊహాగానాల పరిధిలోనే ఉన్నాయి. ఆమె తదుపరి ప్రకటనే దీనిపై స్పష్టతనివ్వనున్నది.
