TS Inter Board
విధాతః ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ కు లేఖ రాశారు. గెస్ట్ లెక్చరర్ల నియామకంలో గతంలో పనిచేసిన వారిని పరిగణలోకి తీసుకోకుండా మెరిట్ ఆధారంగా నియామకం చేపట్టేందుకు బోర్డు నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ల పాటు పనిచేస్తున్న 1,654మంది గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలను రోడ్డున పడేసేలా ఉందన్నారు.
తమ ఉద్యోగాలకు భద్రత లభిస్తుందన్న భావనతో తెలంగాణ ఉద్యమంలో వారంతా క్రియాశీలకంగా పనిచేశారన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులైజేషన్ తరహాలో తమ ఉద్యోగాలు కూడా స్వరాష్ట్రంలో రెగ్యులర్ అవుతాయన్న గెస్ట్ లెక్చరర్ల ఆశలు వమ్ము చేసే రీతిలో కనీసం ఉద్యోగ రెన్యూవల్ సైతం
చేయకుండా నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయంగా ఉందన్నారు. నోటిఫికేషన్లో గెస్ట్ లెక్చరర్ల సీనియార్టీ కాకుండా పీజీ మెరిట్ పరిగణలోకి తీసుకోవాలన్న నిబంధనలు సరికావని, వెంటనే దానిని ఉపసంహరించుకుని గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా వారిని రెన్యూవల్ చేయాలని జీవన్రెడ్డి కోరారు.