Undavalli Sridevi |
వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబును కలిశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆమె తన భర్తతో కలిసి భేటీ అయ్యారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైపు క్రాస్ వోటింగ్ చేసారని ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎమ్మెల్యేల్లో శ్రీదేవి కూడా ఉన్నారు.
రాజధాని అమరావతి ఈమె నియోజకవర్గంలోనే ఉంటుంది. దీంతో ఈమె ఇప్పుడు టీడీపీ వైపు వెళ్తారని అంటున్నారు. మరి టికెట్ ఇస్తారా ? లేదా అన్నది తెలియడం లేదు. వాస్తవానికి ఆమె పట్ల సమాజంలో బాగా వ్యతిరేకత ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లో తేలిందట. అందుకే ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని జగన్ చెప్పారని, అందుకే ఆమె టీడీపీ వైపు మొగ్గు చూపి ఆ అభ్యర్థికి ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలవడానికి సాయపడ్డారని అంటున్నారు.
ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకా ఈ ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురూ టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్చార్ గా టీడీపీ నియమించగా మేకపాటి కూడా ఉదయగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు.
వేంకటగిరి నుంచి టీడీపీ టికెట్ ఇస్తుందని ఆనం రామనారాయణ రెడ్డి ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ నలుగురూ అక్కడికి చేరి ఇప్పటికే టీడీపీలో ఉన్న నాయకులకు బీపీ తెప్పిస్తున్నారు. మరి వీళ్ళను చంద్రబాబు ఎలా సర్దుబాటు చేస్తారో .. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఎలా సర్ది చెబుతారో చూడాలి.