- కదులుతున్న రైల్లో మహిళపై
- గ్యాంగ్ రేప్ ఘటనలో సీరియస్
- ఇలాంటి ఘటనలు పునరావృతం
- కాకుండా చూడాలని ఆదేశం
విధాత: కదులుతున్న రైలులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనపై అలహాబాద్ హైకోర్టు రైల్వేశాఖపై సీరియస్ అయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. బాధితురాలికి న్యాయం చేయాలని సూచించింది. 2016లో కదులుతున్న రైలులో మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను తోసివేయడంపై దాఖలైన సుమోటో పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సోమవారం రైల్వే మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది. మౌలో జరిగిన ఘటనకు సంబంధించి దాఖలైన సుమోటో పిటిషన్పై జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ బీఆర్ సింగ్లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం పై ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం అందించాలని అదేశించింది. అయితే, బాధితురాలికి ఇప్పటికే రూ. 2,81,000 అందించినట్టు రైల్వే తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, మిగిలిన మొత్తాన్ని ఇప్పటి వరకు ఎందుకు చెల్లించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యల తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.