Lover Murder | తనను కాదని మరొకరిని పెళ్లాడిన లవర్పై ప్రియుడు కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని ఆమె ఎవరికీ కూడా దక్కొద్దనే ఉద్దేశంతో ప్రియుడు నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో గుడికి వెళ్దామని ఆమెను తీసుకెళ్లి విచక్షణారహితంగా నరికి చంపాడు. ఆమె శరీరాన్ని 6 ముక్కలుగా నరికేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అజంఘర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అజంఘర్ జిల్లాలోని ఇషాక్పూర్ గ్రామానికి చెందిన ఆరాధన, ప్రిన్స్ యాదవ్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఆరాధన యాదవ్ను దూరం పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంంలో మరొకరిని వివాహం చేసుకుంది. అప్పట్నుంచి ఆరాధనపై యాదవ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 9వ తేదీన ఆరాధనను యాదవ్ కలిశాడు. గుడికి వెళ్దామని చెప్పి తన బైక్పై ఎక్కించుకున్నాడు. గుడికి వెళ్లకుండా.. నేరుగా చెరుకు తోటల్లోకి తీసుకెళ్లాడు. తన ఫ్రెండ్ సహాయంతో ఆరాధనను అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం పదునైన ఆయుధాలను ఉపయోగించి, ఆమె శరీరాన్ని 6 ముక్కలుగా నరికి, గోనే సంచిలో చుట్టేశారు. పశ్చిమి గ్రామ సమీపంలో ఉన్న ఓ బావిలో మృతదేహాన్ని పడేశాడు. తలను మాత్రం ఆ బావికి కొంచెం దూరంలో ఉన్న చెరువులో పడేశాడు.
రెండు రోజుల క్రితం బావిలో తేలియాడుతున్న శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న బావి వద్దకు నిందితుడిని తీసుకెళ్లగా, అక్కడ దాచిపెట్టిన తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరపగా, కాలికి తీవ్ర గాయమైంది. మొత్తంగా ఆరాధన శరీర భాగాలతో పాటు తలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఈ ఘటనతో స్థానికులంతా ఉలిక్కిపడ్డారు.