అమరావతి : ఏపీ( Andhra Pradesh)మన్యం ఏజెన్సీలో మారేడుమిల్లి( Maredumilli forest) అటవీ ప్రాంతంలో ఒక రోజు వ్యవధిలో చోటుచేసుకున్న మరో ఎన్ కౌంటర్(Encounter)లో ఏడుగురు మావోయిస్టులు(7 Maoists) మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లుగా ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతుల్లో శ్రీకాకుళానికి చెందిన మావోయిస్టు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి తిప్పారి తిరుపతి @ దేవ్ జీ, అజాద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఉన్నట్లు సమాచారం. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర లడ్డా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చత్తీస్ గఢ్ లో భద్రతాబలగాల ఒత్తిడితో మావోయిస్టులు ఏపీలోకి వచ్చినట్లుగా తెలిపారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు చనిపోయారని.. మిగిలిన మావోయిస్టులు ఎవరైన ఉంటే లొంగిపోవడం మంచిదన్నారు. 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ ను ముగిస్తామని.. ఈ లోగా ఎవరికైనా ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చునని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డులను వారికే ఇచ్చి.. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో కొన్నాళ్లు షెల్టర్ తీసుకుని తర్వాత పక్క రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు కొనసాగించాలన్న ఆలోచనతో వారు ఇక్కడికి వచ్చినట్లుగా భావిస్తున్నామని తెలిపారు.
