Congress
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీపై తెచ్చిన ఆర్డినెన్స్ను తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. విపక్షాల బెంగళూరు సమావేశానికి ఒక రోజు ముందు చేసిన ఈ ప్రకటన ద్వారా విపక్ష ఐక్యత విషయంలో తాము పట్టువిడుపులు ప్రదర్శిస్తామని కాంగ్రెస్ చెప్పినట్లయింది. ఢిల్లీపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలు ఆప్కు మద్దతు ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలో కాంగ్రెస్ చేరడం విశేషం. ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ఢిల్లీ ఆర్డినెన్స్ను తాము సమర్థించడబోవటం లేదని చెప్పారు.
‘సోమవారం నాటి సమావేశానికి వారు (ఆప్) హాజరవుతారని నేను భావిస్తున్నాను. ఢిల్లీ సర్వీసెస్ అధికారుల నియంత్రణ విషయంలో తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మేం దానిని సమర్థించబోవడం లేదు’ అని ఆయన చెప్పారు.
Congress announces its unequivocal opposition to the Delhi Ordinance. https://t.co/OgTECPJ52M
— Raghav Chadha (@raghav_chadha) July 16, 2023
కాంగ్రెస్ ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దా ‘ఢిల్లీ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ విస్పష్టంగా ప్రకటించింది. ఇది సానుకూల పరిణామం’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు.. ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయనంత వరకూ ప్రతిపక్షాల ఐక్యత విషయంలో తాము ఎలాంటి సంప్రదింపుల్లో భాగస్వాములు కాబోమని ఆప్ తేల్చి చెప్పింది.
అయితే.. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం అనంతరం ఆప్కు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపింది. అదే విషయాన్ని వేణుగోపాల్ వెల్లడించారు. ‘శనివారం మేం సమావేశమయ్యాం. ఇప్పటికే మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశ సమాఖ్య వ్యవస్థకు ద్రోహంచేసే ఎలాంటి ప్రయత్నాన్నిగానీ, గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పద్ధతులను గానీ మేం అంగీకరించం.
ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలోనూ అంతే. మేం మద్దతు ఇవ్వం. ఇది చాలా స్పష్టం’ అని ఆయన తెలిపారు. వేణుగోపాల్ ప్రకటన తర్వాత ఆప్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. బెంగళూరు సమావేశానికి తాము హాజరవుతామని రాఘవ్ ఛద్దా ప్రకటించారు.