9 రోజుల వ్యవధిలోనే బీహార్‌లో కూలిన మరో వంతెన

తొమ్మిది రోజుల వ్యవధిలోనే బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఇటీవలికాలంలో కూలిన వంతెనల సంఖ్య ఆరుకు పెరిగింది. మధుబని, సుపౌల్‌ మధ్య భూతాహి నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు

  • Publish Date - June 29, 2024 / 06:13 PM IST

పాట్నా: తొమ్మిది రోజుల వ్యవధిలోనే బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఇటీవలికాలంలో కూలిన వంతెనల సంఖ్య ఆరుకు పెరిగింది. మధుబని, సుపౌల్‌ మధ్య భూతాహి నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీనిపై ఎక్స్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఒక వీడియో విడుదల చేస్తూ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘బీహార్‌లో 9 రోజుల వ్యవధిలో ఐదో వంతెన కూలిపోయింది. భూతాహి నదిపై మధుబని, సుపౌల్‌ మధ్య నిర్మాణలో ఉన్న వంతెన కూలింది. మీకు తెలుసా? తెలుసుకునేందుకు ప్రయత్నించండి.. అంటూ #Bihar #Bridge అనే హ్యాష్‌ట్యాగ్స్‌ పెట్టారు. ఈ వంతెన కూలిన ప్రాంతం నేపాల్‌కు సరిహద్దులో ఉన్నది. దాదాపు రెండేళ్లుగా ఈ వంతెన నిర్మాణంలో ఉన్నదని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఈ బ్రిడ్జ్‌ పిల్లర్‌ ఒకటి కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. నేపాల్‌లోని పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో భూతాహి నది పొంగిపొర్లుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్‌ని 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వంతెన కూలిపోవడంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌కే మరమ్మతు బాధ్యత అప్పగించారు.గతవారం అరారియా, సివాన్‌, తూర్పు చంపారన్‌ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. గురువారం కూడా కిషన్‌గంజ్‌ ఏరియాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకున్నది.

Latest News