Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. పోలింగ్ ప్రారంభ సమయానికి ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. సాధారణ పౌరులతోపాటు కొందరు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉదయాన్నే ఓటు వేశారు.
బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సాద్వి నిరంజన్, లోక్జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, యాక్టర్ ఫర్హాన్ అక్తర్, దర్శకులు జోయా అక్తర్ తదితరులు ఉదయాన్నే ఓటు వేసిన వాళ్లలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
ఐదో దశలో యూపీలోని 14 లోక్సభ స్థానాలకు, మహారాష్ట్రలోని 13 లోక్సభ స్థానాలకు, బెంగాల్లోని ఏడు లోక్సభ స్థానాలకు, ఒడిశాలోని 5 లోక్సభ స్థానాలకు, బీహార్లోని 5 లోక్సభ స్థానాలకు, జార్ఖండ్లోని మూడు లోక్సభ స్థానాలకు, జమ్ముకశ్మీర్, లఢక్లలో ఒక్కో లోక్సభ స్థానానికి పోలింగ్ ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతున్నది.
కాంగ్రెస్కు కీలక స్థానాలైన రాయ్బరేలీ, అమేథిలో కూడా ఇవాళే పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాయబరేలీలో రాహుల్గాంధీ, అమేథిలో సీనియర్ నేత కేఎల్ శర్మ కాంగ్రెస్ తరఫున బరిలో దిగారు. ఐదో దశ ఎన్నికల్లో బరిలో నిలిచిన ప్రముఖుల్లో రాహుల్గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ ఉన్నారు.