విధాత: సాయుధ పోరాట విరమణ(ceasefire )పై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన(Maoist party statement) చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రల ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని..అయితే ముందుగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూంబింగ్ ఆపరేషన్స్ , ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని ప్రకటనలో స్పష్టం చేసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే సాయుధ పోరాట విరమణపై తేదీని ప్రకటిస్తాం అని తెలిపింది. ఎప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్స్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది.
సీసీఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు మావోయిస్టు పార్టీ తన ప్రకటనలో వెల్లడించింది. బస్వరాజు ఎన్ కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని..ఆయుధ విరమణపై ప్రకటన చేస్తాం అని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈనెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మావోయిస్టులపై అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆయుధాల విరమణపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల ప్రకటనపై మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్రం ఏ విధంగా స్పందించబోతుందో చూడాల్సి ఉంది.
