Somanath | బోయింగ్కు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్తో పాటు బార్ట్ విల్మోర్ సైతం ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్షిప్లోనే గడుపుతున్నారు. ప్రస్తుతం స్టార్లైనర్కు మరమ్మతులు చేసే పని కొనసాగుతున్నది. ఇద్దరు ఎప్పుడు భూమిపైకి తిరిగి వస్తారనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే, విషయంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్నాథ్ స్పందించారు. ఇద్దరు భూమిపైకి తిరిగిరావడంలో జరుగుతున్న జాప్యంపై ఆందోళనకరమైన అంశమేమికాదన్నారు. స్పేస్షిప్ భద్రతాపరమైన ప్రదేశమనని.. గతంలో అక్కడ తొమ్మిది మంది వ్యోమగాములు ఉన్నారని గుర్తు చేశారు. ఇద్దరూ అక్కడికి తిరిగిరావడంలో ఇబ్బందులు మాత్రమే తలెత్తాయన్నారు. వారంతా ఏదో ఒక రోజు తిరిగి భూమిపైకి రావాల్సిందేనని.. బోయింగ్ తయారు చేసిన క్రూ మాడ్యూల్ స్టార్లైనర్ను టెస్ట్ చేయడమే ప్రధాన అంశమని చెప్పారు. వ్యోమగాములను భూమిపైకి తీసుకునే సామరథ్యం స్టార్లైనర్కు ఉందా? లేదా? అనే అంశంపై పరీక్షిస్తున్నారని.. అయితే, భూమిపై నుంచి కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కు రప్పించే లాంచ్ ప్రొవైడర్లు సిద్ధంగా ఉననారన్నారు.
అసలు ఇది సమస్యే కాదని.. ఐఎస్ఎస్ భద్రాపరమైన ప్రదేశమని.. అక్కడ ఎంతకాలం అంటే అంతకాలం ఉండవచ్చన్నారు. స్టార్లైనర్ వంటి ఎయిర్క్రాఫ్ట్లో సక్రమంగా పని చేస్తాయా? లేదా అనేదే ఇక్కడ ప్రధాన సమస్య అన్నారు. ప్రస్తుతం స్పేస్ ఏజెన్సీలు ఇదే అంశంపై దృష్టి పెట్టాయన్నారు. అయితే, సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలు అందరికీ గర్వకారణమంటూ ప్రశంసించారు. ఆమె ఇప్పటికే ఎన్నో మిషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారని.. స్టార్లైనర్ నిర్మాణంలోనూ ఆమె తన అనుభవాల ఆధారంగా సూచనలు చేశారని.. ఆమె సురక్షితంగా భూమికి క్షేమంగా చేరుకోవాలని.. అదే సమయంలో మరిన్ని స్పేస్షటిల్స్ నిర్మాణాల్లో పాలు పంచుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. స్టార్లైనర్ స్పేస్షిప్ను బోయింగ్ సంస్థ తయారు చేసింది. పలుసార్లు వాయిదాపడుతూ వచ్చిన ప్రయోగం.. ఈ నెల 5న నింగిలోకి దూసుకెళ్లింది. ఈ స్పేస్షిప్లో సునీతా విలియమ్స్తో పాటు బార్ట్ విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. తిరిగి వచ్చేందుకు ప్రయత్నించగా.. స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆస్ట్రోనాట్స్ తిరిగి భూమిని చేరుకోవడంలో ఆలస్యమవుతున్నది.