Zika Virus : మహారాష్ట్రలోని పుణె నగరంలో జికా వైరస్ విజృంభిస్తున్నది. నగరంలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు. సిటీలోని ఎరంద్వానే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల గర్భిణికి జికా వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారుల తెలిపారు. ఆమెతోపాటు మరో 12 వారాల గర్భిణికి కూడా జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
వాస్తవానికి గర్భిణిలు జికా వైరస్ బారిన పడినట్లయితే పిండంలో మైక్రోసెఫాలీ సంభవించే ప్రమాదం ఉంటుంది. మెదడు సరిగా అభివృద్ధి చెందక తల చాలా చిన్నదిగా మారే పరిస్థితిని మైక్రోసెఫాలీ అంటారు. జికా వైరస్ మొదటి కేసు కూడా ఎరంద్వానే ప్రాంతంలోనే నమోదైంది. 46 ఏళ్ల వైద్యుడికి పాజిటివ్ వచ్చింది. తర్వాత అతని 15 ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్గా తేలింది.
అదేవిధంగా ముండ్వా ప్రాంతంలో ఇద్దరు జికా సోకిన వ్యక్తులు కనుగొనబడ్డారు. వారిలో ఒకరు 47 ఏళ్ల మహిళ, మరొకరు 22 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. దాంతో పుణె మున్సిపల్ కార్పొరేషన్లోని ఆరోగ్య విభాగం రోగులందరినీ పర్యవేక్షిస్తున్నది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుజాగ్రత్త చర్యగా దోమల బారినపడకుండా ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ జికా వైరస్ ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమ డెంగ్యూ , చికున్ గున్యా వంటి వైరస్లను కూడా వ్యాప్తి చేస్తుంది. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ జికా వైరస్ను గుర్తించారు.